అమరావతి : ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న ఉద్యోగ పోస్టుల భర్తీని ఆదర్శంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్ హామీ ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 2.35 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉంటే.. గత సంవత్సరం 10,143 ఉద్యోగాలకే జాబ్ క్యాలెండర్ ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ సంఘాలు ఈ నెల 12న ఆందోళనకు సిద్ధమయ్యారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు నిన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయన్నటుల్ ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.