అమరావతి : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ చేనేత కళాకారులు, ఆధారిత కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం పథకాలను కట్ చేస్తుందని ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేతల సంక్షేమం కోసం అమలైన అనేక కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. అరకొరగా కేవలం 20 శాతం మందికే అమలు చేస్తున్న నేతన్న నేస్తం పథకం లబ్ధిదారుల్లో మరింత కోత పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కఠిన నిబంధనలు వెనక్కి తీసుకొని నేతన్న నేస్తం చేనేత కళాకారులందరికీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా విధిస్తున్న జీఎస్టీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.