అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం (cabinet Meeting) నేడు చివరిసారిగా సమావేశం కానుంది. సీఎం జగన్ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్న నేపథ్యంలో నేడు మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎం జగన్ అధ్యక్షతన ప్రస్తుత మంత్రిమండలి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చివరిసారిగా సమావేశమవనుంది. ఈ సమావేశంలోనే మంత్రుల రాజీనామాను సీఎం కోరే అవకాశం ఉందని తెలిసింది. అయితే ఎంతమంది రాజీనామా చేయనున్నారు. మరోసారి ఎవరెవరికి అవకాశం లభించనుంది అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
కాగా, ఏపీ కేబినెట్లో ముఖ్యమంత్రితోపాటు 26 మంది మంత్రులు ఉండాల్సి ఉంది. మంత్రులు రాజీనామా సర్పించనున్న నేపథ్యంలో 25 మందీ కొత్తవారే ఉంటారా? లేదా ప్రస్తుత మంత్రుల్లో కొంతమంది కూడా అందులో ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.