మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మరణాన్ని తాను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గౌతం రెడ్డి మన మధ్య లేరన్న విషయాన్ని ఇంకా తాను నమ్మడమే లేదన్నారు. నెల్లూరు వీపీఆర్ కన్వెన్షన్ హాలులో గౌతంరెడ్డి సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. గౌతం రెడ్డి లేరన్న విషయాన్ని జీర్ణించుకోడానికి ఇంకా సమయం పడుతుందని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
గౌతం రెడ్డి తనకు చిన్ననాటి స్నేహితుడని తెలిపారు. 2009-2010 మధ్య తాను కాంగ్రెస్ నుంచి విడివడినప్పటి నుంచీ గౌతం తనకు అండగా నిలుస్తూనే వున్నారని, ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మాజీ ఎంపీ, గౌతంరెడ్డి తండ్రి రామ్మోహన్ రెడ్డి కూడా గౌతం రెడ్డి వల్లే తనకు మద్దతిచ్చారని జగన్ వ్యాఖ్యానించారు.
ప్రతి పనీలోనూ గౌతం రెడ్డి తనను ప్రోత్సహించేవారని, తనను కూడా ప్రేరేపించేవారని సీఎం జగన్ పేర్కొన్నారు. గౌతం రెడ్డిని తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, ఆ తర్వాత మంచి రాజకీయ నేతగా ఎదిగారని తెలిపారు. ఓ మంచి మంత్రిగా తన కేబినెట్లో కొనసాగారని, దాదాపు 6 శాఖలను సమర్థవంతంగా నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. ఏపీకి పరిశ్రమలను తీసుకురావడంలో గౌతం రెడ్డి చాలా కష్టపడ్డారని, ఎంతో తాపత్రయపడేవారని అన్నారు. గౌతంరెడ్డి కుటుంబానికి తనతో సహా, వైసీపీ మొత్తం తోడుగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు.