అమరావతి: ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఏపీ సచివాలయంలోని ఛాంబర్ లో స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఏపీ సీఎం వైఎస్ జగన్, బీఏసీ సభ్యులు, టీడీపీ తరుఫున అచ్చెన్నాయుడు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం లో ఐదురోజుల పాటు సమావేశాలు జరుపాలని నిర్ణయించాయి.
అయితే టీడీపీ ప్రస్తావించే అంశాలపై కులంకశంగా చర్చ జరగాలని అచ్చెన్నాయుడు ప్రతిపాదించగా సీఎం జగన్ కల్పించుకుని దేనిపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అవసరమైతే ఈఎస్ఐ స్కామ్ (గతంలో అచ్చెన్నాయు డు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో జరిగిన అక్రమాలు)పై కూడా చర్చిద్దామని పంచ్ విసిరారు. టీడీపీ సభ్యులు రెచ్చగొడితే మావాళ్లు ధీటుగా కౌంటర్ ఇస్తారని పేర్కొన్నారు. రాజధాని అంశంపై చర్చ కావాలంటే దానిపై కూడా చర్చిస్తామని సమాధానమిచ్చారు.
ఇవాళ ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం కాగానే టీడీపీ సభ్యుల నిరసనలపై బీఏసీ సమావేశంలో చర్చ జరిగింది. సభ్యుల ప్రవర్తన సక్రమంగా లేదని మంత్రులు పేర్కొన్నారు.