అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. తొలుత ఈ నెల 3 న జరుపాలని నిశ్చయించారు. కాగా, క్యాబినెట్ భేటీని మార్చి 7 న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత నెలలో గుండెపోటుతో మరణించిన దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి దశదిన కర్మ నేపథ్యంలో క్యాబినెట్ భేటీ వాయిదా నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 7న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉండగా.. తొలిరోజు గవర్నర్ ప్రసంగం అనంతరం క్యాబినెట్ సమావేశం జరపాలని నిశ్చయించారు. బడ్జెట్ సమావేశాలను 20 రోజుల పాటు జరపాలని ప్రభుత్వం యోచిస్తున్నది. దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టడమే కాకుండా, ప్రభుత్వం కొన్ని బిల్లులను ముఖ్యంగా మూడు రాజధానుల బిల్లు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుదలపై బిల్లును తీసుకురానున్నట్లుగా తెలుస్తున్నది. మరోవైపు ఈ సమావేశాలకు టీడీపీ హాజరవుతుందా లేదా అనే చర్చ రాష్ట్రమంతటా జరుగుతున్నది.