హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ‘జాతీయ ప్రాజెక్టు పేరిట ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండానే పర్యావరణ అనుమతులు ఎలా ఇస్తారు? ప్రభావిత రాష్ర్టాలను సంప్రదించకుండానే ఏకపక్షంగా ముంపు సర్వేలు, అంచనాలు ఎలా రూపొందిస్తారు? బ్యాక్వాటర్ ఎఫెక్ట్పై సమగ్ర అధ్యయనం చేయకుండా పనులు ఎలా చేపడతారు?’ అని కేంద్ర జల్శక్తిపై ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. బ్యాక్ వాటర్ ఎఫెక్ట్పై సమగ్ర అధ్యయనం చేయాల్సిందేనని, అప్పటివరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టుకు అంగీకరించేది లేదని స్పష్టంచేశాయి. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం బ్యాక్వాటర్ ఎఫెక్ట్పై ప్రభావిత రాష్ర్టాలైన తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్కుమార్ గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. వర్చువల్గా సాగిన ఈ సమావేశంలో ఆయా రాష్ర్టాల కార్యదర్శులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
పోలవరానికి సంబంధించి ఇప్పటివరకు తమ రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టలేదని ఒడిశా మండిపడింది. ఎనిమిదేండ్లుగా ఇదే విషయమై మొత్తుకుంటున్నా కేంద్రం, ఏపీ పట్టించుకోవట్లేదని ఆక్షేపించింది. ప్రజాభిప్రాయ సేకరణ జరపకపోవడం నిజమేనని కేంద్ర జల్శక్తి ఒప్పుకొన్నది. ప్రాజెక్టు నిర్మా ణం కోసం తీసుకొన్న అనుమతులకు, ప్రస్తు తం కొనసాగుతున్న పనులకు ఏమాత్రం పొం తన లేదని ఒడిశా విరుచుకుపడింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా తమ రాష్ట్ర భూభాగంలోని ముంపు సమస్యలను ప్రస్తావించింది.
పోలవరం బ్యాక్ వాటర్ వల్ల భద్రాచలంతోపాటు అంచనాకు మించి గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉన్నదని కేంద్ర జల్శక్తిమంత్రిత్వ శాఖకు తెలంగాణ సర్కారు వివరించింది. గతంలో టీఏసీ ఇచ్చిన అనుమతులు, అంచనాలన్నీ ప్రస్తుతం మారిపోయాయనని చెప్పింది. 36 లక్షల క్యూసెక్కుల వరద సామర్థ్యానికి అనుగుణంగా డ్యామ్, స్పిల్వే రూపొందించగా, ప్రస్తుతం ఆ సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచారని.. 10వేల క్యూసెక్కులతో డిజైన్ చేసిన కుడి, ఎడమ కన్వేయర్ సిస్టమ్ను 17.50 వేలకు పెంచారని తెలిపింది. తత్ఫలితంగా ముంపు ప్రభావం కూడా పెరిగిందని వివరించింది. మార్పుల ఫలితంగా గతంలో నిర్ధారించిన 106 గ్రామాలతోపాటు తెలంగాణలో అదనంగా 60 గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేసింది.
పోలవరం ముంపుపై తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఆందోళన నేపథ్యంలో కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ ఆయా రాష్ర్టాలకు చెందిన సాంకేతిక నిపుణులతో అక్టోబర్ 7న మరోసారి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. త్వరలో ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల్లో సీడబ్ల్యూసీ అధికార బృందం పర్యటించి, ప్రాజెక్టు ముంపుపై నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తుందని చెప్పింది. ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేస్తుందని వెల్లడించింది. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్, సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు దేశ్పాండే, ఇంటర్స్టేట్ వాటర్ బోర్డు ఈఈ సుబ్రహ్మణ్యప్రసాద్, ఏపీ కార్యదర్శి శశిభూషణ్, ఈఎన్సీ నారాయణరెడ్డి, ఒడిశా, ఛత్తీస్గఢ్ అధికారులు పాల్గొన్నారు.