హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)/ఘట్కేసర్ రూరల్: అనురాగ్ యూనివర్సిటీ నిర్వహించిన 2022 ప్రవేశ పరీక్ష ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకులు సాధించిన ర్యాంకర్లను గురువారం వర్సిటీ ఘనంగా సత్కరించింది. టాప్ 500 మంది ర్యాంకర్లకు ఉచితంగా ల్యాప్ టాప్లు అందజేసింది. టాప్ 100లోపు ర్యాంకులు సాధించిన వారికి 25 శాతం నుంచి 100 శాతం వరకు ట్యూషన్ ఫీజులో రాయితీ ఇవ్వనున్నట్టు వర్సిటీ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం చెప్పారు. ఉచిత ల్యాప్ టాప్లు, ట్యూషన్ ఫీజులో రాయితీ కోసం వర్సిటీ రూ.5.3 కోట్లు వరకు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అనురాగ్ నిర్వహించిన సెట్కు 17 వేల మంది హాజరుకాగా, 13,600 మంది ర్యాంకులు ప్రకటించినట్టు వీసీ వెల్లడించారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్ సమీస్ ఫాతిమా, డైరెక్టర్ (స్ట్రాటజీ అండ్ ప్లానింగ్) పల్లా అనురాగ్, ఎగ్జామినేషన్ డీన్ ప్రొఫెసర్ ముత్తారెడ్డి, సెట్ కన్వీనర్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.