మంచి సినిమా ఎప్పుడైనా మనుగడ సాగిస్తుందని, కేవలం సోషల్మీడియా బాయ్కాట్ ప్రచారాల వల్ల ప్రేక్షకులు సినిమాల్ని తిరస్కరించరని అభిప్రాయపడ్డారు బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ఖేర్. సినిమాలపై పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేసే ధోరణి ఎప్పటి నుంచో ఉందని, ప్రస్తుత సమాచార యుగంలో అది కాస్త పరాకాష్టకు చేరుకున్నదన్నారు. ఇటీవల విడుదలైన ‘కార్తికేయ-2’ చిత్రంలో అనుపమ్ఖేర్ కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుపమ్ఖేర్ సమకాలీన భారతీయ సినిమా తీరుతెన్నులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘విద్వేషకులు ఏ తరంలోనైనా ఉంటారు. కేవలం వారివల్లే సినిమాలు ఆడటం లేదన్నది తప్పుడు అభిప్రాయం. మంచి కంటెంట్ ఉన్న సినిమాను ఏ శక్తీ అడ్డుకోలేదు. నా సుదీర్ఘ అనుభవంతో ఈ మాట చెబుతున్నా’ అని అనుపమ్ఖేర్ తెలిపారు. దక్షిణాది సినిమాలపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు, తమిళం, మలయాళ చిత్రసీమల్లో మంచి కథకులు వస్తున్నారని..సృజనాత్మకమైన కంటెంట్ను అందిస్తున్నారని చెప్పారు.