‘ఎంటర్టైన్మెంట్ నా బలం. ఆ వాస్తవాన్ని గ్రహించి నేను చేసిన సినిమా ఇది’ అని అన్నారు శ్రీను గవిరెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. రాజ్తరుణ్ హీరోగా నటించారు. సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ నెల 26న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో శ్రీను గవిరెడ్డి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘పూరి జగన్నాథ్ స్ఫూర్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టా. 2016లో ‘రామయ్య అందాలు సీతమ్మ సిత్రాలు’ అనే సినిమా చేశా. ఆదిసాయికుమార్ నటించిన ‘గరం’ సినిమాకు కథ, మాటలు రాశా. ‘క్రాక్’ చిత్రానికి రచనావిభాగంలో పనిచేశా. నా తొలి సినిమా సరిగా ఆడలేదు. రెండో అవకాశం రావడానికి చాలా సమయం పట్టింది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో ఈ కథ రాసుకున్నా. జీవితం చాలా చిన్నది దానిని పరిపూర్ణంగా ఆస్వాదించాలని భావించే ఓ యువకుడి కథ ఇది. నిజంగా జీవితాన్ని అనుభవించడం అంటే ఏమిటో ఈ సినిమాలో చూపించబోతున్నాం. తప్పటడుగుల వల్ల జీవితం ఎలా తారుమారు అవుతుందో అర్థవంతంగా చెప్పాం. ఇందులో సెక్యూరిటీ గార్డ్గా, అమాయకత్వం, కోపం కలబోసిన గ్రామీణ యువకుడిగా రాజ్తరుణ్ పాత్ర భిన్న పార్శాలతో సాగుతుంది. సుప్రియతో పాటు నాగార్జున, నాగచైతన్య కథ విని బాగుందన్నారు. తొలి సినిమా తర్వాత వచ్చిన విరామంలో ఇండస్ట్రీ నాకు చాలా నేర్పించింది. ఇదివరకు చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డా. విభిన్నమైన కథాంశంతో తదుపరి సినిమా చేయబోతున్నా’ అని తెలిపారు.