‘భిన్న ధృవాల్లాంటి ఓ జంట మధ్య మొదలైన ప్రేమ ఎలా పెళ్లిపీటలవరకు చేరుకుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నది లక్ష్మీసౌజన్య. ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 29 సినిమాను విడుదలచేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత మాట్లాడుతూ ‘ప్రేమ, వినోదం, భావోద్వేగాల సమ్మిళితంగా సాగే చిత్రమిది. దూకుడు మనస్తత్వం కలిగిన అమ్మాయి, సాత్వికుడైన అబ్బాయి మధ్య సాగే కథ ఇది. వారు ఎలా జంటగా మారారన్నది ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభిస్తున్నది’ అని తెలిపారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, మాటలు: గణేష్ కుమార్ రావూరి.