తిరుమల పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 518వ వర్ధంతిని గురువారం తిరుమలలో ఘనంగా నిర్వమించారు. ఈ సందర్భంగా నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఊంజల్సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనల గోష్టిగానంతో సప్తగిరులు పులకించాయి. కొవిడ్ – 19 నిబంధనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అహోబిల మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామిజీ అనుగ్రహభాషణం చేశారు. అన్నమయ్యకు, వారి ఆచార్యపీఠమైన అహోబిల మఠానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. అన్నమయ్య సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం వినేందుకే ప్రతి ఏడాది ఇక్కడికి వస్తున్నట్టు టీటీడీ ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి చెప్పారు.
తిరుమలతో పాటు తిరుపతి, తాళ్లపాకలో కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. అన్నమయ్య సంకీర్ణన అనంతరం అహోబిలం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శ్రీవణ్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారిని టీటీడీ ఈవో, అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి, సీవీఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి కలసి శాలువ, శ్రీవారి ప్రసాదంతో సన్మానించారు. అహోబిల మఠం తరఫున టీటీడీ ఈవో, అదనపు ఈవోను సన్మానించారు. అనంతరం టిటిడి తరఫున తాళ్లపాక వంశీయులను సత్కరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు ఆచార్య దక్షిణామూర్తి శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాధ్, వీజీవో బాలిరెడ్డి, పేష్కార్ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.