తిరుమల : తిరుచానూరు పద్మావతీ అమ్మవారి పవిత్రోత్సవాలకు శుక్రవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 20 వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం ఇవాళ సాయంత్రం 6 నుంచి విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహించారు. ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాది మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఉత్సవాల్లో భాగంగా 18న పవిత్ర ప్రతిష్ఠ, 19న పవిత్ర ప్రతిష్ఠ సమర్పణ, 20న మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. కొవిడ్ నిబంధనల మేరకు అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, జేఈఓ సదా భార్గవి, ఆలయ డెప్యూటీ ఈఓ కస్తూరి బాయి, ఏఈఓ ప్రభాకర్రెడ్డి, ఆలయ అర్చకులు బాబుస్వామి, బాబుస్వామి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రాజేశ్ పాల్గొన్నారు.