నాగ్పూర్ సమీపంలోని మాంగ్లీ. అదొక ఆదివాసీ గూడెం. ఏడాది పొడవునా వ్యవసాయం చేస్తారు వాళ్లు. కానీ, పైసా సంపాదన లేదు.అవే వెతలు, అవే కన్నీటి కథలు. 2016లో ఆ జీవితాల్లోకి ఒక వీరుడు ప్రవేశించాడు. అప్పటినుంచి మన్యంలో సిరులపంట పండుతున్నది.
మాంగ్లీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ వ్యక్తి పేరు.. అనిరుధ్ చావోజీ. ఆరు ఎకరాల అటవీ భూమిని, నాలుగు ఎకరాలు బంజరు భూమిని సారవంతమైన నేలగా మార్చి, స్థానిక ప్రజలకు ఆదర్శంగా నిలిచాడు.
అడవితో అనుబంధం
అనిరుధ్ గతంలో ఒక పర్యావరణ సంస్థలో పనిచేస్తున్నప్పుడు, అంధారీ టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్ పరిధిలోని మాంగ్లీలో కొంతకాలం ఉన్నాడు. పంటలను పాడు చేస్తున్నాయని వన్యప్రాణులను చంపటం, ఏకరీతి పంటలు మాత్రమే సాగు చేయడం, నీటికోసం విచ్చలవిడిగా బోర్లు వేయడం.. వంటి పర్యావరణ ప్రతికూల పద్ధతుల్లోకి వెళ్తున్నారు వాళ్లు. వారిలో మార్పు తీసుకురావాలనుకున్నాడు అనిరుధ్. ఉద్యోగం వదిలేసి ఆ గిరిజనులకు దగ్గరయ్యాడు.
గిట్టుబాటు ఎందుకు లేదు?
‘సంవత్సరం పొడవునా వ్యవసాయం చేస్తున్నా.. మాంగ్లీ గ్రామస్తులు ఆర్థికంగా ఎందుకు ఎదగడం లేదు’ అన్న కోణంలో సర్వే చేశాడు. ‘పంట మార్పిడి విధానం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం’ అని తెలుసుకొన్నాడు. వాళ్లు ఎక్కువగా పత్తి వేస్తుంటారు. అదే పనిగా ఏండ్ల తరబడి పత్తి సాగు చేయడం వల్ల మట్టిలోని నత్రజని, ఇతర పోషకాలు పెద్ద మొత్తంలో కోల్పోయి భూమి నిస్సారమవుతుంది. పంట దిగుబడికూడా ఆశాజనకంగా ఉండదు. మాంగ్లీలో ఈ పరిస్థితి గత కొన్నేండ్లుగా కొనసాగుతున్నది.
జీవవైవిధ్య సాగు
నిస్సారమైన భూముల్లో సారం నింపడమే ప్రథమ లక్ష్యంగా నిర్దేశించుకొన్నాడు అనిరుధ్. బంజరు భూమిని నాలుగు విభాగాలుగా విభజించి దానిని చెట్లు, పంటలు, నీటి నిల్వ, జంతువుల సంరక్షణకు అనువుగా మార్చేశాడు. పంట మార్పిడి విధానాన్ని తీసుకొచ్చాడు. సేంద్రియ సాగులో పంటలు ఎలా వేయాలో రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. పత్తి లాంటి పంటలే కాదు కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో, తక్షణ ఆదాయం ఎలా పొందవచ్చో అవగాహన కల్పించాడు. జీవ వైవిధ్యం ద్వారానే జీవుల మనుగడ సాధ్యమని అనిరుధ్ గ్రహించాడు. తన పొలంలో దట్టమైన చెట్లు పెంచాడు. నీటి నిల్వలు పెంపొందించాడు. జంతువులు అటువైపు రాకుండా.. సున్నితమైన కంచెలు ఏర్పాటు చేశాడు. జీవ వైవిధ్యానికి ప్రాధాన్యమిచ్చేలా పొలాన్ని పునరుద్ధరించాడు. ఇలా రైతులకు ఆదర్శంగా నిలిచాడు.
సమస్యలు వెంటాడినా..
వ్యవసాయంలో అనుభవం లేకపోవడం వల్ల మొదట్లో కొంత నష్టం చవిచూడాల్సి వచ్చింది. కొన్నిసార్లు భూమి చాలా తేమగా లేదా చాలా పొడిగా ఉండేది. మొక్కజొన్న, గోధుమ వంటి పంటలు వేస్తే ఒక్క మొలక కూడా రాలేదు. పసుపు తోట వేయగా వాతావరణంలో మార్పులవల్ల సరైన ఆదాయం లభించలేదు. వెదురు సాగు చేస్తే తెగుళ్లు సోకి దాదాపు 120 చెట్లు చని పోయాయి. పంటలు నష్టపోవడానికి అది ప్రధాన కారణం అయ్యింది. ఈ సమస్యలను అధిగమించడానికి, రోటావేటర్ ద్వారా నేలను సక్రమంగా పెకిలించేవాడు. కార్బన్ కోసం జీవామృతాన్ని ఉపయోగించాడు.
మారిన జీవితాలు
నేల సారవంతమై, పంటలకు సానుకూలంగా ఉందని అనుకున్నప్పుడు అనిరుధ్ పంట భ్రమణ విధానాన్ని అమలు చేశాడు. పత్తి, సోయాబీన్ వంటివే కాదు నారింజ, మామిడి వంటి పండ్లతోటలనుకూడా సాగు చేశాడు. జంతువులకు పొలంలోని చెట్ల ఆకులను ఆహారంగా వేసేవాడు. వన్యప్రాణులను రక్షించడం కూడా అతడి లక్ష్యంలో భాగం కాబట్టి, ఆకులపై తెగులు ఆనవాళ్లేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకునేవాడు. సంవత్సరాలు గడిచాయి. దిగుబడి గణనీయంగా పెరిగింది. మొదట స్వయం సమృద్ధి కోసమే వేసిన పంటలు ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తున్నాయి. తాజా సాంకేతిక పరిజ్ఞానాలు ఎలా అన్వయించుకోవాలి, పంటలను ఎలా సమర్థంగా పండించాలి, మంచి ధరను పొందగల మార్కెట్ చిట్కాలు.. వంటి వాటిగురించి చర్చించడానికి రైతులతో వారాంతపు సమావేశాలు నిర్వహిస్తున్నాడు. అధిక దిగుబడికోసం వర్షపునీటి సంరక్షణ పద్ధతిని ఎంచుకోవాలని రైతులకు సూచించి, పాటించేలా కృషి చేస్తున్నాడు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల లీటర్ల నీటిని సంరక్షించేలా ఏర్పాటు చేశారు. పులి, చిరుత, అడవిపంది వంటి వన్యప్రాణులు ఈ అడవిలో ఉంటాయి. వాటినుంచి పంటలను కాపాడుకోవడానికి సౌర కంచెలను ఏర్పాటుచేశారు. పంటల్లోకి వచ్చిన జంతువులను ఒక నిర్దిష్ట మార్గంలో బయటికి పంపడానికి సాసర్ ఆకారపు వాటర్హోల్స్ను సృష్టించాడు. ఆ మార్గంలో శబ్దాలు చేసే సౌర ఫెన్సింగ్ను ఏర్పాటుచేశారు. దీనివల్ల జంతువుల మరణాలు కూడా తగ్గాయి. ఇక తిరుగేముంది?