మూగజీవాల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా
ఒక్క కాల్తో వస్తున్న 1962 వాహనం
పరీక్షలు చేస్తున్న వైద్యులు, ల్యాబ్ల్లో టెస్ట్లు
నియోజకవర్గానికి ఒకటి కేటాయింపు
మెదక్ జిల్లాలో రెండు సంచార పశు వైద్యశాలలు
హర్షం వ్యక్తం చేస్తున్న పెంపంకం దారులు
ఆపదలో ఉన్న వ్యక్తుల కోసం ‘108’ ద్వారా వైద్యసేవలందించిన తరహాలోనే రోగాలు, ప్రమాదాల్లో గాయపడిన మూగజీవాలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశువైద్యశాలలు సత్ఫలితాలనిస్తున్నాయి. మారుమూల పల్లెల్లో ఉండే వారికి తమ జీవాలకు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని మండల, జిల్లా కేంద్రాల్లోని పశువైద్యశాలలకు తరలించడం కష్టతరమైనదిగా గుర్తించిన ప్రభుత్వం, ఇందుకోసం 2016లో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘1962’ పేరుతో వాహనాన్ని అందుబాటులోకి తేగా, ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో దాదాపు 30వేల జీవాలకు చికిత్సలు అందించారు. ఈ వాహనంలో ఒక పశువైద్యుడు, పారామెడికల్ సిబ్బంది ఒకరు ఉంటారు. ఒక్క ఫోన్కాల్ చేస్తే వీరు పల్లెలకు చేరుకుని ఇంటి వద్దనే వైద్యం అందిస్తున్నారు. మూగజీవాలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయడంతో పాటు ల్యాట్ టెస్ట్లు చేసి అవసరమైన మందులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో మూడు ప్రాంతీయ పశువైద్యశాలలు, 29 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 35 పశుఆరోగ్య ఉపకేంద్రాలు ఉండగా, రెండు మొబైల్ క్లినిక్లు నిరంతరం సేవలు అందిస్తున్నాయి.
మెదక్, మే 19(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో మూడు ప్రాంతీయ పశు వైద్యశాలలు, 29 ప్రాథమిక పశువైద్య కేంద్రాలు, 35 పశు ఆరోగ్య ఉప కేంద్రాలు పని చేస్తున్నాయి. పశువులున్న ఇండ్ల వద్దకే వెళ్లి వైద్య సేవలందించడానికి సంచార పశు వైద్యశాలలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాన్ని 2016లో ప్రారంభించారు. ఇప్పటివరకు దాదాపు 30 వేల జీవాలకు చికిత్సలందించారు. మెదక్ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో 2 వాహనాలు పశువులకు వైద్య సేవలు అందిస్తున్నాయి. వివిధ రోగాలు, ప్రమాదాల్లో గాయాలపాలైన మూగజీవాలను కాపాడేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ వాహనంలో పశువైద్యులు, వైద్య పరీక్షల కోసం ల్యాబ్ ఉంటుంది. ఒక్కో వాహనంలో ఒక వైద్యుడు, పారామెడికల్ సిబ్బంది, డ్రైవర్ ఉంటారు.
1962కు ఫోన్ చేస్తే చాలు..
సంచార పశు వైద్య సేవలు పొందడానికి 1962 టోల్ఫ్రీ నంబర్ను ఏర్పాటుచేసింది. రైతులు టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే వారి ఇంటి వద్దకే వచ్చి పశువులకు వైద్య సేవలు అందిస్తారు. ఈ సంచార వాహనంలోనే ల్యాబ్ కూడా ఉంటుంది. వైద్యంతో పాటు మందులూ ఉచితంగానే సమకూరుస్తున్నారు. అంబులేటరీలో వైద్య సేవలందించడానికి జీవీకే సంస్థ వైద్యులను నియమించింది.
ఆపదలో ఉన్న వారు ఒక్క ఫోన్ కాల్ చేస్తే 108 అంబులెన్స్ రెక్కలు కట్టుకుని వచ్చి వాలుతున్నది. రోజూ ఎంతో మంది ప్రాణాలు నిలుపుతున్నది. ఇదే తరహాలో ఇప్పుడు పశువులకూ సేవలు అందించేందుకు 1962 ప్రత్యేక వాహనం అందుబాటులోకి వచ్చింది. మొబైల్ అంబులేటరీ క్లినిక్(సంచార పశు వైద్యశాలలు) పేరిట పశువుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం వీటిని తీసుకొచ్చింది.
ఉచిత వైద్య సేవలు, మందులు అందిస్తారు
మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో రెండు వాహనాలు ఏర్పాటుచేశాం. టోల్ఫ్రీ నంబర్ 1962కు ఫోన్ చేస్తే ఉచితంగా వైద్య సేవలు, మందులు అందిస్తారు. ఒక్కో వాహనంలో ఒక పశు వైద్యుడు, పారామెడికల్ సిబ్బంది ఒకరు, డ్రైవర్ ఉంటారు. సంచార పశు వైద్య శాలలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. – విజయశేఖర్రెడ్డి, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి, మెదక్