విశాఖలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. తమ డిమాండ్లను సాధించుకునేందుకు అంగన్వాడీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు అంగన్వాడీలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అంగన్వాడీల మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకున్నది. తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ అంగన్వాడీలు బైఠాయించేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని తప్పించారు.
డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు కదం తొక్కారు. విశాఖ కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అంగన్వాడీలను నిలువరించేందుకు పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో.. కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని దాటుకుని కొందరు గోడలు దూకి కలెక్టరేట్లోకి ప్రవేశించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ.26 వేల ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
అంగన్వాడీలు పెద్ద సంఖ్యలో రావడం.. వారిని అడ్డుకునేంత సంఖ్యలో మహిళా పోలీసులు లేకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది. మగ పోలీసులు కూడా రంగంలోకి దిగాల్సివచ్చింది. భారీగా అంగన్వాడీలు వస్తున్నారనేది పోలీసులు ముందస్తుగా గుర్తించకపోవడం వల్ల ఇబ్బందికరంగా మారిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.