పహాడీషరీఫ్:తెలంగాణ ప్రభుత్వం మరోసారి జీతాల పెంపుతో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాల పెంపుదలకు జీవో విడుదల చేయడం. పెంచిన జీతాలను జులై నుంచి ఇవ్వాలని చెప్పడంతో అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఆనందానికి అవధుల్లేవు. ఉమ్మడి రాష్ర్ట పాలనలో అంగన్వాడీ టీచర్లకు రూ. 4,200, హెల్పర్లకు రూ. 2,200లు మాత్రమే వేతనాలు ఉండేవి.
స్వరాష్ట్రం వస్తే ప్రతి ఒక్కరీ జీవితాలు బాగుపడుతాయని తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న సమయంలో కేసీఆర్ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రం సాధించిన అనంతరం ఇప్పడి వరకు మూడు సార్లు జీతాలు పెంపుదల చేశారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్ల నెల వేతనం రూ. 13,500, ఆయాల నెల వేతనం రూ. 7800లకు పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు వేతనాలు పెంచుతూ తమ జీవితాలలో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్కు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కృతజతలు తెలియజేస్తున్నారు .
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాము
సీఎం సార్ చెప్పినట్లుగానే తమ కష్టాలను గుర్తించి ఎప్పటికప్పుడు జీతాలు పెంచుతూ వస్తున్నాడు. అడగక ముందే జీతాలు పెంచి సమాజంలో తమకు గౌరవ ప్రధమైన స్థానం కల్పిస్తున్నారు. తమ కుటుంబాలు ఎల్లప్పుడు కేసీఆర్కు రుణపడి ఉంటాయి. గతంలో కూడా ఒకసారి సీఎం అంగన్వాడీ టీచర్లను. ఆయాలను ప్రగతి భవన్కు పిలిపించారు. సీఎం కేసీఆర్తో భోజనం చేసే అదృష్టం కలిగింది. అప్పుడు కూడా జీతాలు పెంచారు. మా కుటుంబ సభ్యులు చాలా చాలా సంబురపడుతున్నారు.-విజయలక్ష్మి, తెలంగాణ అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు, జల్పల్లి అంగన్వాడీ టీచర్
చాలా సంతోషంగా ఉంది
జీతాలు పెంపుదల చేయడానికి తమ అదృష్టంగా భావిస్తున్నాము. తాము చేస్తున్న కష్టాలకు ఫలితం దక్కుతుంది. సీఎం కేసీఆర్కు తమ కుటుంబాలు ఎల్లప్పుడు రుణపడి ఉంటాము. ఉద్యమాలతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ మా జీతాలను పెంచి జీవితాలను మారుస్తున్నాడు. మా కష్టాలను గుర్తించిన కేసీఆర్ జీతాలు పెంచడం తమ అదృష్టంగా భావిస్తున్నాము.-సరస్వతి, శ్రీరామకాలనీ అంగన్వాడీ టీచర్