అమరావతి : పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వైసీపీ రెబల్ఎంపీ రఘురా మకృష్ణరాజు అరెస్టుపై దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్పై ఏపీ హైకోర్టు మరికాసేట్లో విచారణ జరుపనుంది. రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడంపై ఆయన తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో విచారణ పూర్తయ్యేంత వరకు ఆయనను మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచవద్దని సీఐడీ అధికారులకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసుల కస్టడీలో ఉన్న రఘురామకు ఆహారం, వైద్యం, వసతికి వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది. రాత్రి నుంచి గుంటూర్సీఐడీ కార్యాలయంలోనే రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయనకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
గుంటూర్ సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలోనే అధికారులు మరోసారి ఆయనను విచారిస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేలా మాట్లాడారని ఆయనపై రాజద్రోహం (124ఏ) కింద కేసు నమోదు చేశారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడారని ఎంపీపై అభియోగాలను మోపారు. ఎంపీతోపాటు రెండు టీవీ ఛానళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.