హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఏపీ టీచర్లపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్న మా టల్లో తప్పేముందని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రశ్నించారు. హరీశ్రావుపై వైఎస్సార్సీపీ జనరల్ సెక్రెటరీ సజ్జల రామకృష్ణారెడ్డి, ఏపీ మంత్రి అమర్నాథ్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంత్రి హరీశ్రావు మాట్లాడిన సందర్భం వేరు అయినప్పటికీ ఇష్టమొచ్చిన రీతిలో ఏపీ మంత్రులు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం 73 శాతం ఫిట్మెంట్ ఇస్తే, పక్క రాష్ట్రంలో 66 శాతం మించి ఇవ్వలేదని.. కేంద్రం విధించిన షరతులకు తలొగ్గి వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రూ.7వేల కోట్లు తీసుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇతర రాష్ర్టాల వారిపైగాని, ప్రభుత్వ ఉద్యోగులపై గాని మంత్రి హరీశ్రావు ఏనాడు తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుంటే ఏపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రచారం కోసం ఏపీ నాయకులు తెలంగాణపై గాని, టీఆర్ఎస్ నాయకులపై గాని అనవసరపు వ్యాఖ్యలు చేయవద్దని హితవు పలికారు.