అమరావతి : ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం వేకువ జాము నుంచి బంద్ కొనసాగుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రబంద్కు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి బంద్కు పిలుపునిచ్చింది. బంద్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం అనుమతి ఇచ్చింది. బీజేపీ మినహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు, ప్రజా, కార్మిక సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. బంద్ ప్రభావంతో విశాఖపట్నంలో అర్బన్ సిటీ బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. విజయవాడ నెహ్రూ బస్స్టేషన్ ఎదుట రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టాయి. అధికార వైఎస్సార్సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆప్, టీఎన్టీయూసీ, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్, ఎస్ఎఫ్ఐ సంఘాలు సైతం నిరసనలో పాల్గొన్నాయి.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బంద్తో అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. బంద్కు లారీ యాజమాన్య సంఘాలు మద్దతు ప్రకటించారు. అలాగే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ బంద్కు సంఘీభావం ప్రకటించింది. బంద్ నేపథ్యంలో మధ్యాహ్నం ఒంటిగంటి వరకు బస్సులు డిపోలకే పరిమితంకానున్నాయి. మధ్యాహ్నం తర్వాత బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. అన్ని డిపోల వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి కార్మికులు విధులకు హాజరుకానున్నారు. విశాఖ మద్దెలపాలెం బస్ డిపో వద్ద వామపక్షాల నేతలు ఆందోళన చేపట్టారు. బంద్ సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.