శ్రీశైలం : శ్రీశైల క్షేత్ర ప్రధాన ఆలయానికి పరివార ఆలయాలైన పంచమఠాలలో ఒకటైన ఘంటామఠం పునరుద్ధరణ పనులు చేస్తుండగా అత్యంత పురాతన 21 తామ్ర శాసనాలు బయటపడినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఘంటామఠంలో జీర్ణోధారణ పనులు చేస్తున్న సిబ్బంది ఆలయానికి ఉత్తరం వాయువ్యం వైపు వివిధ పరిమాణాల్లోని రాగి రేకులు కనిపించాయి. వీటిని పరిశీలించి తామ్ర శాసనాలుగా నిర్ధారించుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు.
స్థానిక ఇన్స్పెక్టర్ బీవీరమణ, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, దేవస్థానం ఈఈ మురళీకృష్ణ, ఆలయ ప్రత్యేక భద్రతా అధికారి నర్సింహారెడ్డి, డిప్యూటీ ఇంజినీర్ నర్సింహారెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకుడు అనిల్ కుమార్, డిప్యూటీ స్థపతి జవహార్, ఏఈ సురేష్ వాటిని పరిశీలించి పంచనామా చేశారు. తామ్ర శాసనాలపై తెలుగు, నందినాగరి లిపి ఉంది. సుమారు 14 నుంచి 16 శతాబ్దం నాటికి చెందినవిగా భావిస్తున్నారు. గతంలో ఇదే ఘంటామఠం సమీపంలోని చిన్న శివాలయం పునరుద్ధరణ పనుల్లో రాగి శాసనాలు, వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఇటీవల శ్రీశైలంలో తవ్వకాల్లో కొన్ని ప్రాచీన రాతి శాసనాలు కూడా బయటపడ్డాయి. చరిత్రకు ఇవి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.