అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అరి’. జయశంకర్ దర్శకుడు. శేషు మారంరెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్ర టైటిల్ లోగోను హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు. దర్శకుడు జయశంకర్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ “అరి’ అనేది సంస్కృత పదం. శత్రువు అని అర్థం వస్తుంది.
ఈ టైటిల్ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే తెలుస్తుంది. కరోనా సమయంలో ఎన్నో కష్టాల కోర్చి ఈ సినిమా పూర్తిచేశాం. అనూప్రూబెన్స్ మంచి ట్యూన్స్ ఇచ్చారు’ అని చెప్పారు. ‘కథ చెప్పినప్పుడే చాలా ఆసక్తిగా అనిపించింది. ఈ చిత్రంలో మానవీయ అంశాలతో పాటు వినోదం కూడా ఉంటుంది.
మనుషులు ఎలా బతకకూడదనే అంశాన్ని వినోదాత్మకంగా చూపించారు’ అని అనసూయ చెప్పింది. ఇండస్ట్రీలోని ప్రతిభావంతుల్ని గుర్తించి అవకాశాలు ఇచ్చే లక్ష్యంతో ఈ బ్యానర్ను స్థాపించామని ..చక్కటి సామాజిక సందేశం ఉన్న కథాంశమిదని నిర్మాతలు పేర్కొన్నారు. సాయికుమార్, వైవా హర్ష, శుభలేఖ సుధాకర్, సురభి శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్రూబెన్స్, సాహిత్యం: వనమాలి, రచన-దర్శకత్వం: జయశంకర్.