చిక్కడపల్లి, అక్టోబర్ 15 : కేంద్రం ఆమోదించిన అటవీ సంరక్షణ నియమాలు ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉన్నాయని వివిధ ఆదివాసీ, రైతు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. అఖిలభారత ఆదివాసీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం జరిగింది. నర్మదా బచావో ఆందోళన్ ప్రతినిధి, సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు ఆదివాసీల హక్కులను హరించేలా ఉన్నాయని, విలువైన అటవీ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే విధంగా ఉన్నాయని మండిపడ్డారు.
మోదీ ప్రభుత్వం అడవి సంరక్షణ నియమాల ద్వారా ఆదివాసీలను అడవుల నుంచి నెట్టివేసే కుట్ర చేస్తున్నదని, పెట్టుబడిదారులకు గులాంగిరి చేస్తున్నదని దుయ్యబట్టారు. అడవులు నశిస్తే ఆదివాసీలకే కాదు.. మొత్తం దేశానికే నష్టమని వివరించారు. అటవీ సంరక్షణకు ఢిల్లీ రైతు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఏఐకేఎంఎస్ అధ్యక్షుడు వేముపల్లి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాగృతి దళ్ నేత్ మాధురి, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మండల వెంకన్న, విజయ్ ఉపాధ్యాయ్, కృష్ణప్రసాద్, రంగారెడ్డి, అశోక్, వెంకటేశ్వర్లు, ప్రసాద్, ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.