అహ్మదాబాద్ : పండగ సీజన్లో వినియోగదారులపై భారం మోపేలా అమూల్ పాల ధరలు పెరిగాయి. అమూల్ బ్రాండ్ పేరుతో పాల ఉత్పత్తులు విక్రయిస్తున్న గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లీటర్ పాలను రూ 2 పెంచింది. తాజా పెంపుతో ఫుల్ క్రీం మిల్క్ లీటర్కు రూ 61 నుంచి రూ 63కు చేరింది.
అమూల్ పాల ధరలు పెరగడంతో వంటింటి బడ్జెట్ మరింత భారం కానుంది. ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో అమూల్ పాల ధరలను పెంచకపోవడం గమనార్హం. గుజరాత్ మినహా ఇతర రాష్ట్రాలన్నింటిలో ఫుల్ క్రీం పాలు, గేదె పాలను అమూల్ లీటర్కు రూ 2 పెంచిందని గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీ ఆర్ఎస్ సోధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
డైరీ ఫ్యాట్ ధరలు పెరగడంతో గోల్డ్, బఫెలో మిల్క్ ధరలను లీటర్కు రూ 2 చొప్పున పెంచినట్టు ఆయన వివరించారు. ఈ ఏడాది ఆగస్ట్లో కూడా అమూల్ గోల్డ్, శక్తి, తాజా మిల్క్ బ్రాండ్ల ధరను లీటర్కు రూ 2 చొప్పున పెంచింది. ఇక లంఫీ వైరస్తోనూ ఉత్తరాది రాష్ట్రాల్లో పాల తయారీ, సరఫరా వ్యవస్ధలపై పెను ప్రభావం చూపింది. ఈ వ్యాధితో ఇప్పటికే దేశవ్యాప్తంగా దాదాపు లక్ష పశువులు మరణించాయి.