హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): మాయలఫకీర్ లాంటి అమిత్షా వలలో తెలంగాణ ప్రజలు ఎన్నటికీ చిక్కరని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. గుజరాత్ గ్యాంగ్కు బానిసలుగా మారిన రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. అమిత్షా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారాడని ఎద్దేవా చేశారు. 370 ఆర్టికల్ రద్దు విషయంలో టీఆర్ఎస్ వైఖరిపై అమిత్షా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 370 రద్దుకు మద్దతుగా టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు పార్లమెంటులో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు. అమిత్షా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్రికెట్ ఆటరాని అమిత్షా కొడుకు జైషా.. బీసీసీఐ కార్యదర్శి కావొచ్చు కానీ, ఉద్యమంలో పాల్గొని, ప్రజా తీర్పుతో గెలిచిన కేటీఆర్ మంత్రి అయితే తప్పా? అని ప్రశ్నించారు. బీజేపీకి చెందిన మంత్రుల పిల్లలు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు కావచ్చు కానీ తెలంగాణలో మాత్రం ఉండకూడదా? అని నిలదీశారు. అమిత్షాకు దమ్ముంటే వారి పార్టీలో కుటుంబ పాలనను నిషేధిస్తూ బీజేపీ కార్యవర్గంలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
దేశాన్ని అప్పుల్లో ముంచిందే బీజేపీ
ఎనిమిదేండ్లలో రూ.8 లక్షల కోట్ల అప్పు చేసి, దేశాన్ని అప్పుల్లో ముంచిన బీజేపీ నేతలకు వాటి గురించి మాట్లాడే అర్హత లేదని బాల్క సుమన్ దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులతో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టిందని, మోదీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టేందుకే మోదీ అప్పులు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో రికార్డు స్థాయిలో నిరుద్యోగిత పెరగడానికి బీజేపీ పాలనే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండుసార్లు బీజేపీకి అధికారం ఇస్తే దేశాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అధికారం కోసం బిచ్చగాడిలా ప్రాధేయ పడే బదులు, రాష్ట్ర ప్రాజెక్టుల కోసం ప్రాధేయపడాలని బండి సంజయ్కు చురకలు వేశారు. సింగరేణిని అమ్మేయడానికి బీజేపీకి అధికారం ఇవ్వాలా? అని ప్రశ్నించారు. బీజేపీకి ఒకసారి అధికారం ఇస్తే తెలంగాణను అమ్మేస్తారని దెప్పిపొడిచారు. మిషన్ భగీరథ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.46 వేల కోట్లు ఖర్చు పెడితే, కేంద్రం రూ.50 కోట్లు ఇచ్చిందని అమిత్షా చెప్పుకోవడం ‘ఇత్తేసి పొత్తుకూడినట్టు’ ఉన్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు. బీజేపీకి ఎన్నికల మీద ప్రేమ ఉంటే పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు పెట్టుకోవాలని సవాల్ చేశారు.
ప్రజలను గోస పెడుతున్న బీజేపీ: ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
బీజేపీ దేశవ్యాప్తంగా ప్రజలను గోస పెడుతున్నదని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ దుయ్యబట్టారు. బీజేపీ రాష్ర్టాల్లో మాదిరిగానే తెలంగాణలోనూ ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలపై బీజేపీకి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీ ఎందుకు స్పష్టమైన వైఖరి చెప్పడం లేదని ప్రశ్నించారు.