Wazir X | కరోనా మహమ్మారి.. అటుపై ఉక్రెయిన్పై రష్యా యుద్ధం.. దరిమిలా నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల.. ఆ ధరలను కట్టడి చేయడానికి వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. ఫలితంగా యావత్ ప్రపంచం ఆర్థిక మాంద్యం అంచుల్లో చిక్కుకున్నది. ఈ నేపథ్యంలో దాదాపు కార్పొరేట్ సంస్థలన్నీ ఆదా చర్యలు చేపట్టాయి. అందులో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ `వజీర్ఎక్స్` కూడా వచ్చి చేరింది. 40 శాతం మంది సిబ్బందిని సాగనంపాలని వజీర్ఎక్స్ నిర్ణయం తీసుకున్నట్లు కాయిన్ డెస్క్ వర్గాలు తెలలిపాయి.
మొత్తం `వజీర్ఎక్స్`లో 150 మంది పని చేస్తున్నారు. వారిలో 50 నుంచి 70 మందికి ఇక ఆఫీసుకు రానవసరం లేదని చెప్పినట్లు ఎక్స్చేంజ్ వర్గాలు తెలిపాయి. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు శుక్రవారం నాడే సంస్థ యాజమాన్యం సమాచారం ఇచ్చిందని, వారికి 45 రోజుల వేతనం చెల్లించి మరీ తొలగించిందని తెలుస్తున్నది. ఇక వారి సేవలు అవసరం లేదని చెప్పినట్లు వినికిడి.
ప్రపంచ ఆర్థిక మాంద్యం ముప్పు నేపథ్యంలో క్రిప్టో కరెన్సీ మార్కెట్.. `బేర్` గుప్పిట్లో చిక్కుకుందని వజీర్ఎక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. భారత క్రిప్టో కరెన్సీ పరిశ్రమకు పన్నుల వడ్డింపు, నియంత్రణ సంస్థల ఆంక్షలు, బ్యాంకు ఖాతాల యాక్సెస్ పొందడం సమస్యాత్మకంగా మారిందని పేర్కొంది. తత్ఫలితంగా అన్ని భారత క్రిప్టో ఎక్స్చేంజ్ల్లో ఆయా క్రిప్టో టోకెన్ల విలువ భారీగా పతనం అవుతున్నదని వివరించింది.
2021 అక్టోబర్ 28న గరిష్ఠంగా 478 మిలియన్ల వాల్యూమ్స్ ట్రేడింగ్ నిర్వహించిన వజీర్ ఎక్స్.. శనివారం (2022 అక్టోబర్ 1) 1.5 మిలియన్ల వాల్యూమ్స్ ట్రేడింగ్కు పరిమితమైంది. ఉద్వాసనకు గురైన వారిలో కస్టమర్ సపోర్ట్, మేనేజర్లు, అసోసియేట్ మేనేజర్లు, టీమ్ లీడర్లు కూడా ఉన్నారు.