న్యూఢిల్లీ : కేరళలో కరోనా వైరస్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతుండటంతో ఆ రాష్ట్రానికి నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల బృందాన్ని పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో రాష్ట్ర ఆరోగ్య శాఖకు నిపుణుల బృందం సహకరిస్తుంది. కేరళలో పది శాతం పైగా పాజిటివిటీ రేటు నమోదవుతున్న 12 జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటించవచ్చని భావిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో కేరళలో అత్యధికంగా 22,056 తాజా కేసులు వెలుగుచూశాయి.
దేశం మొత్తం నమోదైన కేసుల్లో ఇవి 50 శాతంపైగా ఉండటం గమనార్హం. తాజా కేసులతో కేరళలో ఇప్పటివరకూ 33,27,301 కేసులు వెలుగుచూడగా 16,457 మంది మహమ్మారి బారినపడి మరణించారు. కేరళలో కరోనా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు మరిన్ని వ్యాక్సిన్ డోసులు పంపాలని కేరళలో కొవిడ్పై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యుడు డాక్టర్ అనీష్ డిమాండ్ చేశారు. సెరో సర్వే ప్రకారం కేరళలో 42 శాతం మందిలోనే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందినట్టు వెల్లడైందని చెప్పారు. జాతీయ సగటు కంటే కేరళలో అత్యధిక జనాభాకు వ్యాక్సినేషన్ చేపట్టామని తెలిపారు.