హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలను అట్టహాసంగా నిర్వహించేందుకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వందలాది మంది కళాకారులతో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో రెండులక్షల చదరపు అడుగుల సువిశాలమైన, అత్యంత సుందరమైన వాల్టర్-ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో వేడుకలకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం 80కి పైగా కమిటీలు రేయింబవళ్లు కష్టపడుతున్నాయి.
ఆటా అధ్యక్షుడు భువనేశ్ బుజాల, కన్వీనర్ సుధీర్ బండారు, కో-ఆర్డినేటర్ కిరణ్ పాశం, కో-హోస్ట్, కాట్స్ అధ్యక్షు డు సతీశ్ వడ్డీ, ఇతర కీలక సభ్యులు కంట్రోల్ రూమ్ నుంచి పనులను పర్యవేక్షిస్తున్నారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే (డోనర్స్ ) అతిథుల కోసం రవాణా, భోజన, హోటల్ వసతులు కల్పిస్తున్నారు. ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి మేరీల్యాండ్ /వర్జీనియా నుంచి వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వరకు షటిల్ సర్వీసెస్ ఏర్పాటు చేస్తున్నారు. ఆటా మహాసభలకు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరు కానున్నారు.
ఆయనతోపాటు మరో ఆధ్యాత్మిక గురువు (డాజీ) కమలేశ్ డీ పటేల్, ప్రముఖ కవులు, సినీ కళాకారులు, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాజకీయ ప్రముఖులు, క్రికెట్ లెజెండ్స్ కపిల్ దేవ్, సునీల్ గవాసర్, క్రిస్గేల్ హాజరు కానున్నారు. జూలై 1 నుంచి 3 వరకు జరుగనున్న ఈ వేడుకలకు సుమారు 15వేల మంది హాజరవుతారని అం చనా. అమెరికాలోని తెలుగువారందరూ హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. PROMOCODE:CATS ద్వారా జూలై 2,3 తేదీల్లో టికెట్లపై 20 డాలర్ల డిసౌంట్ ఉంటుందని తెలిపారు. టికెట్ల కోసం www.ataconference.org/buy-tickets, మరిన్ని వివరాలకు www.ataconference. orgను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఆటా సభలకు మంత్రి వేముల
రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డికి అమెరికాలో ఘన స్వాగతం లభించింది. ఆటా సభలకు మంత్రి ముఖ్యఅతిథిగా వెళ్లిన ఆయన న్యూయార్క్ చేరుకోగా ఆట ప్రతినిధులు శరత్ వేముల, సతీశ్, సుబ్బరాజు పుష్పగుచ్ఛం అందజేసి, ఘన స్వాగతం పలికారు.