హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ నెల 6 నుంచి 26 వరకు అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో సేవా డేస్/ ఆటా వేడుకలను నిర్వహించనున్నారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆటా ప్రెసిడెంట్ భువనేష్ భూజాల మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జూలై 1 నుంచి 3వ తేదీ వరకు వాషింగ్టన్ డీసీ ఈ-కన్వెన్షన్ సెంటర్లో 17వ ఆటా మహాసభలను తెలుగు వారి ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించేలా నిర్వహిస్తున్నామన్నారు.
అంతకుముందు మన రెండు రాష్ర్టాల్లో ఆటా వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. అమెరికాలో 1990లో ఆటాను స్థాపించి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఆటా వేడుకల చైర్మన్ మధు బొమ్మినేని మాట్లాడుతూ.. గడిచిన 20 ఏళ్లుగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి స్థానికంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నామన్నారు. వనపర్తి జిల్లాలో సోమవారం పశువైద్యశాలను ప్రారంభించడంతో ఈ వేడుకలు మొదలవుతాయన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో స్కూళ్లను బాగు చేయడం, పిల్లలకు స్కాలర్షిప్లు, స్కూల్ బ్యాగుల పంపిణీ, అంగన్వాడీల్లో వసతుల కల్పన, మహిళలకు స్వయం ఉపాధి ప్రోత్సాహలు అందించడం లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ క్రమంలోనే 11వ తేదీన హైదరాబాద్లో అంతర్జాతీయ సాహిత్య సదస్సు ‘ఆటా అక్షరాల బాట’ను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. రెండు రాష్ర్టాల్లో వివిధ జిల్లాల్లో ఆటా వేడుకలు ఉంటాయని, డిసెంబర్ 26న రవీంద్రభారతిలో ‘ఆటా నాదం’ గ్రాండ్ ఫినాలే పాటల పోటీతో వేడుకలను ముగిస్తామన్నారు.
ఇందుకు సహకరిస్తున్న రెండు రాష్ర్టాల ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆటా సేవా డేస్ కో చైర్మన్లు అనిల్ బొద్దిరెడ్డి, శరత్ వేముల, ఆటా పాలక మండలి సభ్యులు సుధీర్ బండారు, రామకృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటా వేడుకలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.