ఢిల్లీ, మే 30: మరణించిన ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని ఆరు లక్షలనుంచి 7 లక్షలకు పెంచింది కేంద్ర కార్మిక శాఖ. కార్మికుల కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరేలా కేంద్ర కార్మిక శాఖ సవరణ చేసింది. ఒక సంస్థలో గానీ, అంతకు మించి పలు సంస్థల్లో గానీ ఎవరైనా ఉద్యోగి తాను మరణించిన సంవత్సరానికి పూర్వం 12 నెలలపాటు సభ్యుడై ఉన్న పక్షంలో అర్హులైన కుటుంబ సభ్యులకు రూ. 2.5లక్షల కనీస హామీ ప్రయోజనం లభిస్తుంది. ఇంతకు ముందు అమలులో ఉన్న నిబంధన ప్రకారమైతే ఒకే సంస్థలో సుదీర్ఘంగా 12ఏండ్ల పాటు ఉద్యోగి అయి ఉండాలన్న షరతు ఉండేది. అయితే, సవరించిన ఈ నిబంధనతో తరచుగా ఉద్యోగాలు మారవలసిన పరిస్థితుల్లో ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగులకు, కాజువల్ ఉద్యోగులకు ప్రయోజనం లభిస్తుంది.
కనీస హామీ ప్రయోజన రూపంలో చెల్లించే రూ. 2.3లక్షల పరిహారానికి సంబంధించిన నిబంధనను,..గత ఏడాది (2020) ఫిబ్రవరి 15నుంచి అమలులోకి వచ్చేలా పునరుద్ధరించారు. రాబోయే మూడేండ్లలో అంటే 2021-22వ సంవత్సరం నుంచి 2023-24వ సంవత్సరం వరకూ అర్హులైన కుటుంబ సభ్యులు ఇ.డి.ఎల్.ఐ. నిధినుంచి రూ. 2,185కోట్లను అదనపు ప్రయోజనంగా పొందే అవకాశాలున్నాయని లెక్కలు చెబుతున్నాయి.
ఉద్యోగుల మరణాల కారణంగా నష్టపరిహారం, ప్రయోజనాల కోసం దాఖలు చేసుకునే క్లెయిముల సంఖ్య సంవత్సరానికి 50,000కు పైగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కోవిడ్.తో అస్వస్థత కారణంగా దాదాపు పదివేలదాకా మరణాలు ఉండవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఈ లెక్కలు వేస్తున్నారు.కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా మత్రిత్వ శాఖ చేపట్టిన ఈ సంక్షేమ చర్యలతో కోవిడ్ కారణంగా మరణించిన కార్మికుల కుటుంబాలకు తగిన సహాయం లభిస్తుంది. మహమ్మారి వైరస్ వ్యాప్తితో తీవ్రమైన సవాళ్లను, కష్టాలను ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఇది ఎంతో రక్షణ కల్పిస్తుంది.