నిజామాబాద్ : కరోనా మహమ్మారితో ప్రజలు అల్లాడుతుంటే శవాల మీద చిల్లర ఏరుకునే దుర్మార్గులు బయల్దేరారు. తమకు గిరాకీ లేదని ఏకంగా ఐసీయూలోని కరోనా రోగులను చంపేందుకు కూడా వెనకాడలేదు కిరాతకులు. కరోనా రోగులకు సీరియస్ అయినా.. చనిపోయినా తమకు కిరాయి వస్తుందని అంబులెన్స్ డ్రైవర్లు అత్యంత కిరాతక చర్యకు పూనుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిపివేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. ఆక్సిజన్ సరఫరా ఆపేయడంతో కాసేపు రోగులు అల్లాడిపోయారు.
ఆస్పత్రి వార్డుబాయ్ ఆ దారుణాన్ని చూడడంతో రోగుల ప్రాణాలు నిలిచాయి. తక్షణమే ఆస్పత్రి ఉన్నతాధికారులకు వార్డు బాయ్ సమాచారం అందించడంతో అందరూ అప్రమత్తమయ్యారు. ఈ అత్యంత దారుణ ఘటన నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో వెలుగు చూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.