యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చిన అంబులెన్సు తలుపులు స్టక్ అయిపోయి తెరుచుకోలేదు. దీంతో అతను మరణించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కోయమాన్ (66)ను ఒక స్కూటీ బలంగా ఢీకొట్టింది. రోడ్డుపై రక్తపు మడుగులో అతను పడిపోయి ఉండటం చూసిన కొందరు అంబులెన్సుకు ఫోన్ చేశారు.
సమాచారం అందుకున్న ఒక అంబులెన్సు అతన్ని స్థానికంగా ఉన్నఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ ఆస్పత్రికి చేరుకున్న తర్వాత ఆ అంబులెన్సు తలుపులు తెరుచుకోలేదు. డ్రైవర్, అటెండెంట్ ఎంత ప్రయత్నించినా వాటిని తెరవలేకపోయారు. అరగంటపాటు కష్టపడిన తర్వాత వేరే వాళ్లు వచ్చి అంబులెన్సు అద్దాలు పగలగొట్టి, లోపలి నుంచి తలుపులు తెరిచారు. కానీ అప్పటికే కోయమాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
కేరళలోని ఫెరోకే సమీపంలో నివశించే కోయమాన్.. సోమవారం నాడు రోడ్డుపై వెళ్లుండగా అటుగా వెళ్తున్న ఒక స్కూటీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అంబులెన్సు తలుపుల సంగతి తమకు తెలియదని అతన్ని తీసుకొచ్చిన మెడికల్ కాలేజీ తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశించారు.