Srisailam | మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలి వస్తుండటంతో శ్రీగిరి వైపు అన్ని దారులు రద్దీగా మారాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల భక్తులు తరలి వచ్చారు. ఆదివారం 25 వేల మందికి పైగా భక్తులతో శ్రీశైల మహా క్షేత్రం సందడిగా మారింది.
అందులోనూ మహాలయ అమావాస్య కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే నదీ స్నానాలు చేసుకుని పితృ దేవతలకు తర్పణాలు విడిచారు. అటుపై శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులు దీరారు. ఉచిత దర్శనానికి మూడు గంటలు, శీఘ్ర దర్శనానికి గంటకుపైగా సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. యాత్రికుల రద్దీ నేపథ్యంలో దర్శనం వేళల్లో మార్పులు చేస్తున్నట్లు చెప్పారు.
వందల సంఖ్యలో దంపతులు సామూహిక అభిషేకాలు, బిల్వార్చనలు, అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకున్నారు. స్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవా టిక్కెట్ల కోసం కూడా క్యూలైన్లో గంటల తరబడి నిలబడినా కావల్సిన టిక్కెట్లు పొందలేకపోతున్నామని భక్తులు ఆవేదన చెందుతున్నారు. ఆలయ ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సామాన్య భక్తులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
అమ్మవారి ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్లను పల్లకిపై అధిష్టింపజేసి మూడు ప్రదక్షిణలుగా పల్లకిసేవను నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మ వారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.