AP Minister Botsa | అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందానికి అనుగుణంగా ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన సచివాలయం మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ అమరావతి రైతులకు నష్టం జరుగదని తెలిపారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు ఇస్తామని ఇప్పటికీ తమ ప్రభుత్వం చెబుతున్నదన్నారు.
అధికారం పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబుకు కడుపు మంట అని ధ్వజమెత్తారు. ఆక్రోశంతోనే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారన్నారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో మాట్లాడకుండా చంద్రబాబు బయటే ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. భిన్నాభిప్రాయాలు ఉంటే చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడవచ్చునన్నారు. అందుకు భిన్నంగా బయట ఎందుకు మాట్లాడుతున్నారని నిలదీశారు.
తమ ప్రభుత్వానికి ఉన్న అధికారాలతోనే వికేంద్రీకరణ చట్టాలు చేశామన్నారు. తమ ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తితోనే నడుస్తున్నదని చెప్పారు. బీఆర్ అంబేద్కర్ నిర్దేశించిన రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలు ఉండాలని తాము తొలి నుంచి చెబుతున్నామని బొత్స అన్నారు. తమ ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ బద్ధమేనన్నారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉంటే మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు.