అమరావతి: త్వరలో 22 గ్రామాలను కలుపుకుని మున్సిపాలిటీగా అమరావతి ఏర్పాటు కానున్నది. ఈ మేరకు గ్రామ సభల నిర్వహణ షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 12 నుంచి గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయం మేరకు అమరావతి మున్సిపాలిటీని ఏర్పాటు చేయనున్నారు. గతంలో తుళ్లూరు మండలం పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలు అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటును వ్యతిరేకించారు.
అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు అడుగు పడింది. 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకానున్నది. ఈ నెల 12 నుంచి గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయం మేరకు మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించనున్నది. గతంలో తుళ్లూరు మండలంలోని పలు గ్రామాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించగా.. ప్రస్తుతం నాన్పూలింగ్ గ్రామాలు తమను మున్సిపాలిటీలో చేర్చాలని చేసిన విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకుని ఈ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలతోపాటు నాన్ పూలింగ్ గ్రామాలు పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురంతోపాటు మంగళగిరిలోని మూడు పంచాయతీలు కలిపి మొత్తం 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు కానున్నట్లు సమాచారం.
ఈ నెల 12 న లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, హరిశ్చంద్రపురం, 13 న దొండపాడు, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, 14 న వెంకటపాలెం, మందడం, ఐనవోలు, 15 వ తేదీన నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, రాయపూడి గ్రామాలు, 16 న మల్కాపురం, వెలగపూడి, పెదపరిమి, 17 న శాఖమూరు, నేలపాడు, తుళ్లూరు గ్రామాలలో గ్రామసభలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించారు. ఇలాఉండగా, అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం పట్ల బహుజన పరిరక్షణ సమితి హర్షం ప్రకటించింది. మూడు రాజధానులకు మద్ధతుగా గత 712 రోజులుగా దీక్షలో ఉన్న ఈ సమితి నాయకులు.. అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.