హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లా అమలాపురం రణరంగంగా మారింది. కోనసీమ జిల్లా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సాగిన ఆందోళనలతో అట్టుడికింది. కోనసీమ జిల్లా పేరును మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీశ్ ఇండ్లకు నిప్పుపెట్టారు. పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్ ఇంటిపై రాళ్ల దాడి చేసిన ఆందోళనకారులు అనంతరం ఇంటికి నిప్పుపెట్టారు.
మంత్రి ఇంటిని వేలాదిగా చుట్టుముట్టిన ఆందోళనకారులు ఇంటి అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడున్న ఎస్కార్ట్ వాహనంతో పాటు, ఇంట్లోని మూడు కార్లు ధ్వంసం చేశారు. ద్విచక్రవాహనాన్ని కూడా తగులబెట్టారు. దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు తరలించారు. మరోవైపు, అమలాపురంలోని హౌజింగ్బోర్డు కాలనీలోని ముమ్మిడివరం ఎమ్మెల్యే సతీశ్ ఇంటికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో ఎమ్మెల్యేతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. పరిస్థితులు మరింత అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమగా మార్చవద్దంటూ కోనసీమ జిల్లా సాధన సమితి సోమవారం అమలాపురం గడియారం స్తంభం సెంటర్ దగ్గర ఆందోళన చేపట్టింది. అనంతరం అమలాపురంలో కలెక్టరేట్ ముట్టడించేందుకు ఉద్యమ నేతలు పిలుపునిచ్చారు. వీరు కలెక్టరేట్ వైపుకు వెళ్లకుండా పోలీసులు వాహనాలను అడ్డుగా ఉంచారు. అయితే కొంతమంది యువకులు పరుగులు తీశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వారు కలెక్టరేట్ వైపు వెళ్లగా, అమలాపురం దవాఖాన వద్ద పోలీసు జీపుపై ఓ ఆందోళనకారుడు రాయి విసిరాడు. ఈ ఆందోళన కాస్త ఉద్రిక్తంగా మారింది. ఇది తీవ్రం కావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా యుద్ధరంగంగా మారింది. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.