1955 నుంచి ప్రజలకు సేవలందిస్తున్న దవాఖాన
ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన వైనం..
దవాఖాన అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
మల్కాజిగిరి, ఏప్రిల్ 12 : దవాఖాన పురాతనమైనా వైద్య సేవలు మాత్రం అమోఘం. ఇక్కడ కరోనా వైద్యం సేవలతోపాటు అన్ని రకాల చికిత్సలకు మందులు ఇవ్వడంతోపాటు వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నది అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. అల్వాల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. గత దశాబ్దం కిందట రోజుకు 50 మంది వరకు చికిత్స కోసం వచ్చేవారు. అల్వాల్ చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రస్తుతం రోజుకు 200లకు పైగా రోగులు వస్తున్నారు. ఇక్కడ పిల్లలకు టీకాలతోపాటు ఇతర వ్యాధులకు ఉచితంగా చికిత్సలు అందుతున్నాయి. దవాఖానలో ప్రసవాలు నిర్వహిస్తున్నారు. గతంతో గర్భిణులు ప్రైవేటు దవాఖాలకు వెళ్లేవారు. అయితే ఉచితంగా ప్రసవాలు నిర్వహించడంతో పాటు రూ.12వేల విలువ గల కేసీఆర్ కిట్ను ఉచితంగా అందజేస్తున్నారు.
గర్భవతిగా ఉన్నప్పుడు వైద్య సిబ్బంది వారి పేర్లను నమోదు చేసుకుని నెలనెలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. తర్వాత మగబిడ్డ పుడితే రూ.12వేలు, ఆడ బిడ్డ పుడితే రూ.13వేల ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యర్తలు గర్భిణులకు వైద్య సేవలు చేస్తున్నారు. దాదాపు ప్రతి నెల 40వరకు ప్రసవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ముందస్తు జాగ్రతలు తీసుకుంటున్నారు. దవాఖానలో సిబ్బంది ప్రతిరోజు కరోనా వ్యాక్సినేషన్లతోపాటు కరోనా పరీక్షలు చేస్తున్నారు.
అరవై ఏండ్లుగా వైద్య సేవలు
అల్వాల్ గ్రామంగా ఉన్నప్పుడు స్థానిక దాత ఒకరు తన నివాస గృహాన్ని దవాఖానకు విరాళంగా ఇచ్చారు. భవనంలోని గదులను ఒక్కో విభాగానికి కేటాయించారు. ప్రస్తుతం శిథిలావస్థలకు చేరిన భవనానికి అప్పుడప్పుడు మరమ్మతులు చేసి ఉపయోగిస్తున్నారు. కొత్తగా దవాఖాన భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. 2005లో అప్పటి ఎమ్మెల్యే పి.జనార్దన్ రెడ్డి దవాఖాన అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. ఇక్కడ దవాఖాన పూర్తిస్థాయిలో అభివృద్ధిపరచాలని ప్రతిపాదించారు. తర్వాత ఫైల్ ముందుకు కదలలేదు. తిరిగి 2009లో అప్పటి ఎమ్మెల్యే ఆకులు రాజేందర్ సారధ్యంలో దవాఖాన అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశారు. అయినా పనులు ముందుకు సాగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇప్పటికీ ఫైల్ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. తాత్కాలికంగా రెండేళ్లుగా ఖాళీ స్థలంలో కొన్ని సదుపాయాలు కల్పించి చికిత్సలు అందజేస్తున్నారు. ప్రస్తుతం రోగ నిర్ధారణ కేంద్రం, విశ్రాంతి గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వెంకటాపురం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ బస్తీ దవాఖాన, సుభాష్నగర్లో పట్టణ ఆరోగ్య కేంద్రం, మచ్చ బొల్లారంలోని ఆరోగ్య కేంద్రం ద్వారా వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.