హైదరాబాద్, సెప్టెంబర్ 6 : క్రాస్ బ్రీడింగ్ వల్ల దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళీ ఆవుల సంరక్షణకు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతివ్వాలని ‘సేవ్ దేశీ కౌస్ క్యాంపెనర్’ అల్లోల దివ్యారెడ్డి ఎంపీ సంతోష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు.
మంగళవారం ప్రగతి భవన్లో ఎంపీ సంతోష్ కుమార్ను కలిసి దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమాలను ఆమె వివరించారు. హైబ్రిడ్ జాతులతో క్రాస్ బ్రీడింగ్ పద్ధతుల వల్ల దేశీయ పశుసంపద కనుమరుగైపోకుండా, వాటిని పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు ఈ సంపాదనను అందించాలనే కర్తవ్యంతో సేవ్ దేశీ కౌస్ ప్రచారం చేపట్టినట్లు తెలిపారు.
పర్యావరణ అవగాహన, పచ్చదనం పెంపులో భాగంగా గ్రీన్ ఇండియా చాలెంజ్, సీడ్ గణేషా లాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, దేశవాళి ఆవుల, పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా చేయూతను అందించాలని సంతోష్ కుమార్ ను కోరారు.
సామాజిక బాధ్యతగా దేశవాళీ ఆవుల సంరక్షణ కోసం దివ్యా రెడ్డి చేస్తున్న కృషిని ఎంపీ సంతోష్ కుమార్ అభినందించారు. మంచి కార్యక్రమాలకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.