హైదరాబాద్ : కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించేందుకు.. డిమాండ్కు అనుగుణంగా నిల్వ కోసం స్థలం కేటాయించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి ఎఫ్ఐసీని కోరారు. సోమవారం పౌర సరఫరాల భవన్లోని కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశం జరిగింది. సంస్థ ఎండీ అనిల్కుమార్, జనరల్ మేనేజర్లు రాజారెడ్డి, శ్రీనివాసరావు, నాగేందర్ రెడ్డి, అసిస్టెంట్ సెక్రెటరీ సురేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు, రైతులకు చెల్లింపులు, గన్నీ సంచులు, సీఎంఆర్పై సుదీర్ఘంగా చర్చించారు. బియ్యం అప్పగించేందుకు సిద్ధంగా ఉన్న నిల్వ చేసేందుకు స్థలం లేక జాప్యం జరుగుతోందన్నారు.
పౌర సరఫరాల సంస్థపై ఆర్థిక భారం పడకుండా ఎఫ్సీఐ సమన్వయం చేసుకుని సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. యాసంగిలో పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి 92లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లర్లకు అప్పగించిందన్నారు. 63 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాలని, గడువులోగా అప్పగించాలంటే నెలకు 8 నుంచి 10 లక్షల వరకు ఇవాల్సి ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫ్సీఐతో పాటు జిల్లా అధికారులతో ప్రతి రోజూ మానిటరింగ్ చేసి సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
అలాగే ఎఫ్సీఐ నుంచి రావాల్సిన బకాయిలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) శ్రీనివాసరావును ఆదేశించారు. రైతులకు చెల్లింపు కోసం నాబార్డ్ నుంచి రూ.600 కోట్ల రుణం తీసుకునేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. యాసంగి సీజన్ ముగిసిన నేపథ్యంలో గన్నీ సంచుల రికన్సిలేషన్పై దృష్టిసారించాలని జీఎం నాగేందర్రెడ్డిని ఆదేశించారు.