మల్లాపూర్, జూన్ 6: మల్లాపూర్ మండలంలోని కొత్తదాంరాజ్పల్లి పెద్దచెరువులో మొసలి ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. సోమవారం గ్రామానికి చెందిన ఓ గొర్రెల కాపరి గొర్రెలకు నీళ్లు పెట్టే క్రమంలో ఒక్కసారిగా గొర్రెపిల్లను కొరికి చంపేసింది. అలాగే కొన్ని రోజుల క్రితం సైతం రెండు మేకలకు చంపివేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. చెరువువద్దకు డిప్యూటీ రేంజి అధికారి చంద్రమౌళి, బీట్ అధికారి సత్తార్ చేరుకొని పరిశీలించారు. త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.