హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మీడియా అకాడమీ భవన నిర్మాణాన్ని దసరా పండుగలోపు పూర్తి చేయాలని ఆ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ చేతులమీదుగా దానిని ప్రారంభిస్తామని చెప్పారు. నాంపల్లిలోని అకాడమీ భవన నిర్మాణ పనులను మంగళవారం ఆయన అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ నెలాఖరులోపు భవన నిర్మాణం పూర్తిచేసి అప్పగిస్తామని ఆర్అండ్బీ అధికారులు హామీ ఇచ్చారు. నూతన భవనంలో ఒక ఆడిటోరియం, రెండు తరగతి గదులు, లైబ్రరీ ఉంటాయన్నారు.
2015లో మీడియా అకాడమీ పాత భవనాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్.. సొంత భవనం నిర్మాణానికి వెంటనే రూ.15 కోట్లు మంజూరు చేశారని అల్లం నారాయణ గుర్తుచేశారు. వచ్చే దసరాకు సచివాలయం, అమరవీరుల స్తూపంతోపాటు మీడియా అకాడమీ భవనాన్ని కూడా ప్రారంభించాలన్న తన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని పేర్కొన్నారు. మీడియా అకాడమీలో గ్రామీణ, డెస్ విలేకరులకు కోసం ఒక బ్రిడ్జ్ కోర్స్ రూపొందించి ప్రారంభిస్తామని చెప్పారు. సమీక్షలో అకాడమీ సెక్రటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు, ఆర్అండ్బీ ఇంజినీర్లు మహమ్మద్ హఫీజ్, నర్సింగ్రావు, మాధవి, నితిన్, కాంట్రాక్టర్తోపాటు అకాడమీ మేనేజర్ వెంకటేశం పాల్గొన్నారు.