హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరఫున పోటీచేస్తున్న గెల్లు శ్రీనివాస్ నూటికి నూరు శాతం బీసీ అభ్యర్థేనని, బీసీలంతా ఆయనకే సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. మరి ఈటల రాజేందర్ ఏ సామాజికవర్గీయుడో ఆయనే చెప్పాలని డిమాండ్చేశారు. నిఖార్సైన ఉద్యమకారుడని గెల్లుకు 120 బీసీ సంఘాలు ముక్తకంఠంతో మద్దతు ప్రకటించడంతో తనపై ఈటల కుట్రలు చేస్తున్నాడని కృష్ణయ్య ధ్వజమెత్తారు. కుట్రలు చేయడం ఈటలకు మొదటి నుంచీ అలవాటేనని మండిపడ్డారు. బీసీలు ఏ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓట్లు వేయరని పేర్కొన్నారు.
హైదరాబాద్లో గురువారం నిర్వహించిన బీసీ సంఘాల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ బంధు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్పై తమకు పూర్తి నమ్మకం ఉన్నదని చెప్పారు. ఇచ్చిన మాటను కేసీఆర్ ప్రతిసారీ నిలబెట్టుకున్నారని తెలిపారు. అడగ్గానే బీసీ గురుకులాలు ఇచ్చారని, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ అమలు చేశారని, ప్రతి బీసీ కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తారని అన్నారు. ఈటల ఆరోపిస్తున్నట్టు తాను తీసుకున్న ప్యాకేజీ ఇదే అన్నారు. కులాల ఆధారంగా బీసీ జనగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్చేస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. బీసీల సంక్షేమం కోసం ఇతోధికంగా కృషిచేస్తున్న టీఆర్ఎస్ను కాదని బీసీ వ్యతిరేక బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వాలో చెప్పాలని ప్రశ్నించారు.
బీసీల సంక్షేమం తెలంగాణలోనే అధికం
బీసీలు సీఎంలుగా ఉన్న రాష్ర్టాల్లో కంటే తెలంగాణలోనే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని కృష్ణయ్య పేర్కొన్నారు. ‘రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, దళితబంధు ఇస్తున్నారు. అందుకే కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. బీసీల డిమాండ్లపై ఎంతో సానుకూలంగా స్పందిస్తున్న సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా పనిచేయాలనడం సరికాదు’ అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లను ఎత్తివేయాలన్న కుట్రలో భాగంగా చేపట్టిన పీఎస్యూల ప్రైవేటీకరణను కేంద్రం ఆపాలని, గొంతు నొక్కాలని ప్రయత్నిస్తే 74 కోట్ల మంది బీసీలు తిరగబడతారని హెచ్చరించారు. సమావేశంలో ఓబీసీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ కన్వీనర్ దానకర్ణాచారి, బీసీ సంఘం మహిళ అధ్యక్షురాలు శారదాద, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారాంయాదవ్, అంబాల నారాయణగౌడ్, గుజ్జ కృష్ణ, ముప్పు భిక్షపతి, అలకుంట హరి తదితరులు పాల్గొన్నారు.