న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగాల్సిన ఆసియా కప్ను తటస్థ వేదికపై నిర్వహిస్తామని ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జేషా చెప్పిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ హెచ్చరిక చేసింది. ఇండియాలో జరిగే వరల్డ్కప్లో తాము ఆడబోమని పీసీబీ పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. పాక్ క్రికెట్ బోర్డుకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇండియాలో జరిగే వన్డే వరల్డ్కప్లో పాకిస్థాన్తో పాటు అన్ని పెద్ద జట్లు పాల్గొంటాయని క్రీడామంత్రి ఠాకూర్ తెలిపారు. 2023లో ఇండియా వరల్డ్ కప్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
భారత్ అతిపెద్ద క్రీడా దేశమని, ఇక్కడ ఎన్నో ప్రపంచ కప్లు జరిగాయని, ఇండియాలో వచ్చే ఏడాది వన్డే వరల్డ్కప్ జరుగుతుందని, ప్రపంచంలోని అన్ని పెద్ద జట్లు ఆ టోర్నీలో పాల్గొంటాయని, ఏ క్రీడలోనూ ఇండియాను విస్మరించలేరని, క్రీడలకు ఇండియా ఎంతో చేసిందన్నారు.క్రికెట్కు భారత్ మరీ ఎక్కువే చేసిందన్నారు.
వచ్చే ఏడాది వరల్డ్కప్ నిర్వహిస్తామని, ఆ టోర్నీని చరిత్రాత్మక రీతిలో నిర్వహిస్తామని, పాక్లో సెక్యూర్టీ సమస్యలు ఉన్నాయని, దానిపై కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంటుందని, క్రికెట్ మాత్రమే కాదు, ఇండియా ఇప్పుడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేదని మంత్రి ఠాకూర్ అన్నారు.
మరో వైపు ఇండియా, పాకిస్థాన్ జట్లు ఆదివారం టీ20 వరల్డ్కప్లో తలపడనున్న విషయం తెలిసిందే.