ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో చేపడుతున్న అభివృద్ధికి అన్నివర్గాల సహకారం అవసరమని ఎమ్మెల్యే జోగు రామన్న కోరారు. జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన డివైడర్ల మధ్య మిడిల్ ప్లాంటేషన్ను కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి ఎమ్మెల్యే జోగు రామన్న బుధవారం ప్రారంభించారు. తీర్పేల్లి వద్ద రోడ్డు వెడల్పు పనులతో పాటు చాందా పాత వంతెన వద్ద పరిసరాలను పరిశీలించారు.
అనంతరం కలెక్టర్తో కలిసి చౌరస్తాలో డివైడర్ల మధ్య మీడియన్ ప్లాంటేషన్లో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ పట్టణంలో సుమారు రూ.55 కోట్లతో వివిధ అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టినట్లు చెప్పారు. పట్టణ పరిశుభ్రతలో మమేకమై అంటువ్యాధులకు ఆస్కారం ఇవ్వకుండా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పట్టించాలని కోరారు. అంతకుముందు కలెక్టర్ పట్నాయక్ మాట్లాడుతూ ఆదిలాబాద్ పాత మున్సిపాలిటీ అని,కొత్తదనం తీసుకువచ్చి మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
గ్రీన్ బడ్జెట్ కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీలో రోడ్ల వెడల్పు, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ ఏర్పాటుతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ జాహిర్ రంజాని, కౌన్సిలర్లు బండారి సతీశ్, అర్చన రామ్ కుమార్, నర్సింగ్, అశోక్ స్వామి, మున్సిపల్ కమిషనర్ శైలజ, ఆర్ అండ్ బీ అధికారి సురేశ్, పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.