తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు వేళయింది. నేటి నుంచి మూడు రోజులపాటు అబ్బురపడేలా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. మొదటి రోజు శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, మహిళలు, యువతీయువకులతో భారీ ర్యాలీలు తీసి, బహిరంగ సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం అతిథులకు భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. ఆయాచోట్ల అధికారులు అన్ని ఏర్పాట్లూ చేయగా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి, సుంకె రవిశంకర్ పరిశీలించారు.
కార్పొరేషన్, సెప్టెంబర్ 15 : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. హైదరాబాద్ స్టేట్ యూనియన్ భారత యూనియన్లో చేరి ఈ నెల 17 నాటికి 75వ వత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా మూడు రోజులపాటు వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొదటి రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు తీసి, బహిరంగ సమావేశాలు నిర్వహించనుండగా, ఆయాచోట్ల అధికారులు, ఎమ్మెల్యేలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం కరీంనగర్లో కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. వజ్రోత్సవాల్లో భాగంగా 17న జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, స్వతంత్ర సమరయోధులు, కవులు, కళాకారులను సన్మానించనున్నారు.
శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఉదయం 10 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బస్టాండ్ చౌరస్తా, ప్రతిమ మల్టీఫ్లెక్స్, కలెక్టరేట్, భగత్సింగ్ చౌరస్తా మీదుగా అంబేద్కర్ స్టేడియానికి చేరుకుంటుంది. అనంతరం అక్కడే బహిరంగ సమావేశం నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై.సునీల్రావు, కలెక్టర్ కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యానారాయణ వివిధ జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో హుజురాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానానికి చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సమావేశం నిర్వహించి అతిథులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.
మానకొండూర్ నియోజకవర్గ కేంద్రమైన మానకొండూర్ చెరువు నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది.ముంజంపల్లి ప్రాథమి క సహాకార సంఘం సమీపంలో భారీ బహిరంగ సమావేశం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తోపాటుగా నాయకులు, అధికారులు పాల్గొంటున్నారు.
చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధరలో ఉత్సవాలు నిర్వహించనున్నారు. గంగాధర ఎంపీడీవో కార్యాలయం నుంచి గంగాధర ఎక్స్ రోడ్డు వరకు భారీ ర్యాలీ తీయనున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సమావేశం నిర్వహించనున్నారు. అతిథులకు భోజనాలను ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో పాటు గా నియోజకవర్గ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు పాల్గొంటారు.
పెద్దపల్లి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. హైదరాబాద్ స్టేట్ యూనియన్ భారత యూనియన్లో కలిసి ఈ నెల 17 నాటికి 75వ వత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా మూడు రోజులపాటు వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు పూర్తయ్యాయి. మొదటి రోజు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు తీసి, బహిరంగ సమావేశాలు నిర్వహించనుండగా, ఆయాచోట్ల అధికారులు, ఎమ్మెల్యేలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నా రు. గురువారం పెద్దపల్లిలో కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, ఆదనపు కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే దాసరి, మంథనిలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్, రామగుండం సీపీ చంద్రశేఖర్, పెద్దపల్లి డీసీపీ రూపేశ్, ఏసీపీ గిరిప్రసాద్, మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ, గోదావరిఖనిలో ఆదనపు కలెక్టర్ కుమార్దీపక్, మేయర్ డాక్టర్ బంగి అనిల్కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు ఏర్పాట్లను పరిశీలించారు. వజ్రోత్సవాల్లో భాగంగా 17న జిల్లా కేంద్రాల్లో మంత్రులు జాతీ య పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. 18న జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, స్వాతంత్య్ర సమరయోధులు, కవులు, కళాకారుల సన్మాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
పెద్దపల్లిలో ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ కళాశాల నుంచి ర్యాలీ తీయనున్నారు. 11:30 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు చేరుకుంటారు. 12 గంటలకు భోజన వసతి కల్పిస్తారు.
రామగుండంలో ఉదయం 10 గంటలకు గోదావరిఖనిలోని గాంధీచౌక్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ 11:30 గంటలకు పరుశురాంనగర్లోని ఎల్బీ స్టేడియం వద్ద ముగుస్తుంది. 12 గంటలకు భోజన వసతి కల్పిస్తారు. మంథనిలో ఉదయం 10 గంటలకు పాత పెట్రోల్ పంపు చౌరస్తా నుంచి ర్యాలీని ప్రారంభించి 11:30 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదనం వద్ద ముగిస్తారు. 12గంటలకు భోజన వసతి కల్పిస్తారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ నుంచి ఉదయం 15 వేల మందితో భారీ ర్యాలీ తీస్తారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, జీవన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, పజాప్రతినిధులు, అధికారులతో పాటు, ప్రజలు, యువకులు, విద్యార్థులు, మహిళలు, వివిధ సంఘాల బాధ్యులు పాలుపంచుకుంటారు. టౌన్ హాల్ నుంచి బయలుదేరే ర్యాలీ బాలాజీ థియేటర్, అంబేద్కర్, పాతబస్టాండ్ చౌరస్తా మీదుగా మినీస్టేడియానికి చేరుకుంటుంది. అక్కడ సమావేశా న్ని నిర్వహిస్తారు. జగిత్యాల బాలికల, బా లుర కళాశాలల్లో భోజన వసతి కల్పించారు.