రోడ్ల మీద తిరిగి చేసే ఫీల్డ్వర్క్ కన్నా రోజంతా కుర్చీలో కూర్చుని పనిచేసుకునే ఉద్యోగమే బాగుంటుందని అనుకుంటారు చాలామంది. కానీ, ఇలా గంటలకొద్దీ కుర్చీకి అతుక్కుపోయేవారి జ్ఞాపకశక్తి క్రమంగా తగ్గిపోతుందంటున్నారు పరిశోధకులు. అమెరికాలో జరిగిన పరిశోధనలు ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. ఎక్కువ సమయం కూర్చుని ఉండేవారు డయాబెటిస్, గుండెపోటు వంటి సమస్యల బారిన పడటమే కాదు, వాళ్లకు మతిమరుపు కూడా వస్తుందంటున్నారు. రోజంతా కూర్చునే ఉండటం వల్ల మెదడులో జ్ఞాపకశక్తికి సంబంధించిన విభాగం దెబ్బతింటుందని ఈ పరిశోధనల్లో తేలింది. ఎప్పుడూ కూర్చుని ఉండేవాళ్ల మెదడులోని మీడియల్ టెంపోరల్ లోబ్ (ఎంఆర్ఎల్) పొర పలుచబడుతున్నట్టు ఎంఆర్ఐ పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ పొర దెబ్బతినడం వల్ల మతిమరుపు ఎక్కువై డిమెన్షియా వ్యాధికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అధ్యయనకారులు. ఒకసారి ఎంటిఎల్ పొర దెబ్బతిన్న తరువాత, ఎంత వ్యాయామం చేసినా తిరిగి యథాస్థితికి రావడం లేదు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అల్జీమర్స్ వ్యాధికి కూడా కారణమవుతుందట. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తగినంత వ్యాయామం చేయాలి. గంటకోసారి లేచి అయిదూ పది నిమిషాలు అటూఇటూ నడవాలని సూచిస్తున్నారు పరిశోధకులు.