హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తొలి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)లో ఆలిండియా 86వ ర్యాంకు సాధించిన కాసర్ల రాజును మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ సత్కరించారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎఫ్సీఆర్ఐ) ఆధ్వర్యంలో అరణ్యభవన్లో ఏర్పాటుచేసిన అభినందన సభలో మంత్రులు రాజును సన్మానించారు. ఎఫ్సీఆర్ఐ తరఫున రూ.లక్ష ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ.. అటవీ విద్యను ప్రోత్సహించి, జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ములుగులో ఎఫ్సీఆర్ఐని నెలకొల్పారని చెప్పారు. ఈ సంస్థను స్థాపించిన అనతికాలంలోనే కాసర్ల రాజు వంటి వారు ఐఎఫ్ఎస్ సాధించటం అటవీ కళాశాలకు గర్వకారణమని అన్నారు. జనగామ జిల్లా సూరారంలోని ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాజు.. ఐఎఫ్ఎస్ సాధించి పేదరికం ప్రతిభకు అడ్డు కాదని నిరూపించారని కొనియాడారు. రాజును స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది విద్యార్థులు ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ఉన్నతమైన విద్యా బోధనను అందిస్తున్న అటవీశాఖ ఉన్నతాధికారులు, ఎఫ్సీఆర్ఐ డీన్ ప్రియాంక వర్గీస్, అధ్యాపకులు, సిబ్బందిని అభినందించారు. రాజు మాట్లాడుతూ.. తల్లిదండ్రుల మద్దతు, ఎఫ్సీఆర్ఐ గైడెన్స్తో తాను ర్యాంక్ సాధించానని చెప్పారు. కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేశ్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ ఎంసీ పర్గెయిన్, ఎఫ్సీఆర్ఐ డీన్ ప్రియాంక వర్గీస్, డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, డీసీఎఫ్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.