లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ రాష్ట్ర, కేంద్ర సర్కార్లపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. యూపీతో పాటు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవినీతి, అన్యాయాలను రెట్టింపు చేయడం మినహా ఒరగబెట్టిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎస్పీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపడితే లఖింపూర్ ఖేరి దోషులను జైలుకు పంపుతుందని స్పష్టం చేశారు. ఈ కేసును పూర్తిస్ధాయిలో దర్యాప్తు చేయిస్తామని హామీ ఇచ్చారు. రైతులపై ఎస్యూవీతో దూసుకెళ్లిన మంత్రి కుమారుడు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడని చెబుతూ యోగి ప్రభుత్వం ఈ కేసును సరైన రీతిలో విచారణ చేపట్టడం లేదని దుయ్యబట్టారు.
కన్నౌజ్లో బుధవారం జరిగిన ర్యాలీలో యోగి, మోదీ సర్కార్లపై అఖిలేష్ యాదవ్ ఘాటు విమర్శలు చేశారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మెరుగైన ఫలితాలు రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీలో ముగిసిన రెండు దశల పోలింగ్లో ఎస్పీ కూటమి సెంచరీ స్ధానాల్లో పాగా వేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కన్నౌజ్లోనూ తమను ప్రజలు ఆదరిస్తే కాషాయ పార్టీని మట్టికరిపిస్తామని చెప్పారు. బీజేపీ కర్హల్ అభ్యర్ధి ఎస్పీఎస్ బాఘేల్, బీజేపీ ఎంపీ గీతా షక్యలపై దాడుల గురించి కాషాయ పార్టీ గగ్గోలు పెడుతోందన్న అఖిలేష్ ఓటమి భయంతోనే బీజేపీ తమ నేతలపై తమ పార్టీ వారితోనే దాడులు చేయించుకుని హంగామా చేస్తోందని దుయ్యబట్టారు.
కేంద్ర బలగాలతో పాటు శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన యూపీ ప్రభుత్వం ఏం చేస్తోందని అఖిలేష్ నిలదీశారు. ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు ఎన్నికల్లో గెలుపొంది మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులొడ్డి పోరాడుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతతో అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని ఎస్పీ చెమటోడుస్తోంది. ప్రధాన పార్టీలకు దీటుగా పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీఎస్పీలు పావులు కదుపుతున్నాయి.