హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ) : హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జానపద కళల పరిరక్షణతో పాటు అవి అంతరించిపోకుండా టీటీడీ కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా కరోనా కారణంగా తిరుమలలో కొంతకాలం నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తనను ఆగస్టు 1 నుంచి ప్రారంభించనున్నది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలనుంచి జానపద కళాకారులు తిరుమలకు విచ్చేసి అన్నమయ్య, త్యాగయ్య తదితర వాగ్గేయకారుల భజనలు, కీర్తనలు ఆలపిస్తారు. ప్రయాణ ఖర్చులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమచేస్తారు. ఆగస్టు నెలకు సంబంధించిన భజన బృందాల సభ్యుల స్లాట్ వివరాలను ఇప్పటికే www.tirumala.orgలో అందుబాటులో ఉంచారు.