న్యూఢిల్లీ/జైపూర్, సెప్టెంబర్ 27: రాజస్థాన్ కాంగ్రెస్లో సంక్షోభానికి ముగ్గురు నేతలు కారణమని పేర్కొంటూ వారిపై క్రమశిక్షణా చర్యలకు పార్టీ పరిశీలకుల బృందం అధిష్టానానికి సిఫారసు చేసింది. ఈ మేరకు సోనియాగాంధీకి అజయ్మాకెన్, మల్లికార్జున ఖర్గే మంగళవారం నివేదిక ఇచ్చారు. ఈ జాబితాలో గెహ్లాట్ మద్దతుదారులైన ఇద్దరు మంత్రులు శాంతి ధరివాల్, మహేశ్జోషితో పాటు ఎమ్మెల్యే ధర్మేంద్ర ఉన్నారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఈ ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. సీఎల్పీ సమావేశానికి సమాంతరంగా ఎమ్మెల్యేల భేటీ నిర్వహించారని నివేదికలో పేర్కొన్నారు. గెహ్లాట్కు తెలిసే ఈ భేటీ జరిగిందని తెలిపారు. సోనియాకు గెహ్లాట్ ఫోన్ చేసి ఎమ్మెల్యేల భేటీలో తన ప్రమేయం లేదని తెలిపారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకున్నది. అటు.. గెహ్లాట్ నామినేషన్పై సమాచారం లేదని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ తెలిపారు. శశిథరూర్ మాత్రం ఈ నెల 30న నామినేషన్ వేస్తారని సమాచారం వచ్చిందని చెప్పారు.